న్యూఢిల్లీ: వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్’ రాజ్యాంగ బద్ధతను తమిళనాడు సర్కారు శనివారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పరీక్ష విద్యార్థులకు వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించే రాష్ర్టాల అధికారాలను లాగేసుకుంటున్నదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం వాదించింది.
విద్యపై చట్టాలు చేసే హక్కు, రాష్ర్టాల యూనివర్సిటీలను నియంత్రించే అధికారం రాష్ర్టాలకు ఉంటుందని తన పిటిషన్లో పేర్కొంది. నీట్ ప్రశ్నాపత్రం సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా రూపొందిస్తారని, అది తమ రాష్ట్ర బోర్డు సిలబస్కు భిన్నమైనదని తెలిపింది. నీట్ వల్ల క్షేత్ర స్థాయిలో డబ్బున్న విద్యార్థులకే సీట్లు దక్కుతాయని, మాల్ ప్రాక్టీస్ పెరుగుతుందని, వ్యాపార ధోరణి పెరిగిపోతుందని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.