MK Stalin | చెన్నై: కేంద్రం తమపై హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో భాషా యుద్ధానికి రాష్ట్రం సిద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్సభ స్థానాల పునర్విభజన అంశాన్ని చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
జనాభా నియంత్రణకు దారితీసిన కుటుంబ ప్రణాళిక కార్యక్రమాన్ని తమిళనాడు విజయవంతంగా అమలు చేసిన కారణంగా ఇప్పుడు 8 లోక్సభ స్థానాలను కోల్పోయే ముప్పును రాష్ట్రం ఎదుర్కొంటోందని స్టాలిన్ తెలిపారు. భారత ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాదిపై కత్తి వేలాడుతోందని స్టాలిన్ అన్నారు. హిందీ భాషను రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో మరో భాషాపరమైన యుద్ధానికి కేంద్రం బీజం నాటుతోందా అన్న ప్రశ్నకు అవునని స్టాలిన్ జవాబిస్తూ అందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.