చెన్నై : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దుమారం రేపిన నేపధ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, డీఎంకే (DMK) నేత శేఖర్ బాబు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు, సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ తమ పార్టీ స్వాగతిస్తుందని, అయితే స్త్రీ విద్యను వ్యతిరేకించడం, అంటరానితనం పాటించడం వంటి తిరోగమన విధానాలనే డీఎంకే వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ప్రజల మధ్య అంతరాలు ఉండరాదని, అంటరానితనాన్ని రూపుమాపాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇవన్నీ సనాతన ధర్మంలో పొందుపరచడం వల్లే వీటిని తాము వ్యతిరేకిస్తామని మంత్రి వివరణ ఇచ్చారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మతి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ప్రగతిపధంలో ముందుకుపోతుండటంతో విమర్శించేందుకు ఏ అంశం లేకపోవడంతో సనాతన చర్చను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. అన్నామలై పాదయాత్ర విఫలం కావడంతో గందరగోళానికి గురై సనాతన చర్చను లేవనెత్తారని దుయ్యబట్టారు.
Read More :