చెన్నై: దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే తమిళనాడులో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు జెట్ స్పీడ్తో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నీలగిరి జిల్లాలో డబుల్ డోస్ తీసుకున్నవారు, సింగిల్ డోస్ తీసుకున్నవారు కలిపి మొత్తం 97 శాతానికి చేరారు. అయితే దాన్ని 100 శాతానికి పెంచడం మాత్రం అధికారులకు కష్టసాధ్యంగా మారింది.
ఎందుకంటే చాలామంది మద్యం ప్రియులు ఎప్పుడూ మత్తులో ఉంటున్నారు. దాంతో ఇంటింటికి తిరిగి టీకాలు వేస్తున్న అధికారులు.. మందు బాబులకు మాత్ర టీకాలు వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు డోసుల కొవిడ్ టీకాలు వేసుకున్న వారికి మాత్రమే మద్యం విక్రయించాలంటూ జిల్లాలోని వైన్స్లు, బార్ల యజమానులకు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఆదేశాలు వర్తిస్తాయన్నారు.
మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్లను కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ప్రూఫ్ చూపంచమని అడగాలని, ప్రూఫ్ చూపించిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలని కలెక్టర్ దివ్య తన ఆదేశాల్లో పేర్కొన్నారు. తాజా నిబంధనతో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న తమ లక్ష్యం నెరువేతుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.