న్యూఢిల్లీ, నవంబర్ 25: ఇసుక మైనింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తమిళనాడులో ఒకేసారి పలువురు కలెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అరియలూర్, కరూర్, వెల్లూర్, తంజావూర్, తిరుచ్చి తదితర 10 జిల్లాల కలెక్టర్లకు ఈ నెల 17న ఈ-మెయిల్ ద్వారా ఈ సమన్లను పంపింది.
దీన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)తోపాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని, రాష్ట్ర వ్యవహారాల్లో ఈడీ జోక్యాన్ని పీఎంఎల్ఏ అనుమతించడం లేదని పేర్కొంటూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. వివక్షతో అక్రమంగా కలెక్టర్లకు సమన్లు జారీచేశారని పేర్కొంటూ.. వాటిని కొట్టివేయాలని కోరింది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉన్నది.