చెన్నై: ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) కోరిన దానికి మించిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) తెలిపారు. ఎయిర్ షో సందర్భంగా మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. చెన్నైలోని మెరీనా బీచ్లో ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో వేడి తట్టుకోలేక, ఊపిరి అందక, లోకల్ స్టేషన్ వద్ద తొక్కిసలాట వంటి కారణాల వల్ల ఐదుగురు మరణించగా వందలాది మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
కాగా, సీఎం స్టాలిన్ ఈ సంఘటనపై సోమవారం స్పందించారు. ఎయిర్ షో కోసం రాష్ట్ర అధికారులు అవసరమైన సహకారం, సౌకర్యాలను అందించారని తెలిపారు. వైమానిక దళం కోరిన దాని కంటే మించిన ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పారు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చారని అన్నారు.
మరోవైపు ఎయిర్ షో తర్వాత ప్రజలు తిరిగి వెళ్లేటప్పుడు తమ వాహనాలను, పబ్లిక్ రవాణాను చేరుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తనకు తెలిసిందని సీఎం స్టాలిన్ అన్నారు. భవిష్యత్లో ఇలాంటి పెద్ద ఈవెంట్లు జరిగినప్పుడు ఈ అంశాలపై మరింత శ్రద్ధ చూపుతామని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.