చెన్నై, ఏప్రిల్ 7: తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతంలో మూడు బొగ్గు గనులను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తమిళనాడు సర్కారు నిర్దంద్వంగా తిరస్కరించింది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ రాశారు. బొగ్గు గనుల వేలంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ గానీ, ప్రధాని గానీ కనీస సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.
భవిష్యత్తులో తప్పనిసరిగా రాష్ర్టాన్ని సంప్రదించాలని కోరారు. ఈ బొగ్గు గనులకు గనుక కేంద్రం అనుమతిస్తే తాము ఆందోళన నిర్వహిస్తామని తమిళనాడు రైతు సంఘం సమన్వయ కమిటీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో గనుల వేలాన్ని ఆపివేయాలంటూ ప్రధానికి సీఎం స్టాలిన్ లేఖ రాశారు. ఈ బొగ్గు గనులకే కనుక అనుమతి ఇస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, సారవంతమైన భూములు ఇసుక మేటలుగా మారిపోతాయని, తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని రైతు సంఘం నేత పాండియన్ తెలిపారు. కాగా ఈ బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్రంలోని సీపీఎం, పీఎంకే కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.