చెన్నై, ఏప్రిల్ 14: నియోజకవర్గాల పునర్విభజనలో(డీలిమిటేషన్) రాష్ర్టానికి హాని కలిగించే విధంగా ఏమైనా చేసినా లేదా ఉత్తరాది రాష్ర్టాల రాజకీయ అధికారాన్ని అసమానంగా పంచినా తమిళనాడును స్తంభింపచేసే భారీ ఆందోళనలు, పూర్తి స్థాయిలో నిరసనలు చేపతామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం హెచ్చరించారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియను గోప్యత కప్పివేసిందన్న తన ఆరోపణను పునరుద్ఘాటిస్తూ డీఎంకేను మాత్రమే కాకుండా ఏ రాజకీయ పార్టీని కానీ రాష్ర్టాన్ని కానీ సంప్రదించకుండా బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఏకపక్షంగా ముందుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నదని ఓ వీడియో సందేశంలో స్టాలిన్ ఆరోపించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా నిర్వహించనున్నారో మాకు ఏమాత్రం తెలియదు.
ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ గురించి ఇప్పటివరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు అని ఆయన అన్నారు. తమిళనాడుకు హాని కలిగించే విధంగా గానీ, ఉత్తరాది రాష్ర్టాల రాజకీయ శక్తిని విపరీతంగా పెంచే విధంగా గానీ ఏదైనా జరిగితే తమిళనాడు వాసులు మౌనంగా ఉండబోరని స్టాలిన్ హెచ్చరించారు. తమిళనాడు స్తంభించిపోతుందని ఆయన అన్నారు. తన నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి ప్రతిఘటిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి దృష్టి వాటిపైనే ఉంటుందన్న ఉద్దేశంతో ఢిల్లీలో గుట్టుచప్పుడు కాకుండా డీలిమిటేషన్ నిర్వహించవచ్చని భావించవద్దని, ఆ ఆలోచన కూడా మనసులోకి రానివ్వవద్దని కేంద్రాన్ని ఆయన హెచ్చరించారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా అత్యంత గొప్పదైన ద్రవిడ మున్నేట్ర కళగం ఉద్యమ నాయకుడిగా తాను ఈ విషయం చెబుతున్నానని స్టాలిన్ అన్నారు. మునుపెన్నడూ చూడని తమిళనాడు మీరు చూస్తారు. 1950, 1960ల నాటి డీఎంకే స్ఫూర్తిని భారత్ మరోసారి చూడనున్నది. దీన్ని బెదిరింపుగా భావించవద్దు. ఇది ఓ హెచ్చరిక. ఒకవేళ మీరు దీన్ని బెదిరింపుగా భావించినా అది మాకు సంబంధించిన విషయం కాదు. అవును, ఇది తమిళనాడు నుండి జారీచేసిన తుది హెచ్చరిక అని స్టాలిన్ పేర్కొన్నారు. ఎన్నికలు, అధికారంలో కొనసాగడం తమకు రెండో ప్రాధాన్యతగా పేర్కొంటూ మేము ఆత్మగౌరవం గల ప్రజలం. మాకు సిద్ధాంతాలే ముఖ్యం. రాష్ర్టాల హక్కులు మాకు ముఖ్యం అన్నారు.
ఈ ప్రక్రియ చుట్టూ ఇంతటి గోప్యత నెలకొని ఉన్నపుడు దీని వెనుక తీవ్రమైన ముప్పు దాగి ఉందనే అనుమానం మరింత బలపడుతుదని స్టాలిన్ చెప్పారు. దక్షిణాది రాష్ర్టాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఈనెల 16న నిర్వహిస్తున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ప్రస్తావిస్తూ తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో దీన్ని బలవంతంగా ఏర్పాటు చేస్తున్నారని ఆయన చెప్పారు. డీలిమిటేషన్పై రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదింపచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని ఆయన ఆరోపించారు. తమిళనాడు సహా దక్షిణాది రాష్ర్టాలపై తన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దాలని కేంద్రం చూస్తున్నదని ఆయన చెప్పారు. డీలిమిటేషన్ని హడావుడిగా ఆమోదింపచేయాలనే ఈ ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై చేస్తున్న దారుణమైన దాడిగా ఆయన అభివర్ణించారు.