తిరుచిరాపల్లి, ఏప్రిల్ 1: యూపీ, మణిపూర్ తరహాలో తమిళనాడులో హింసను ప్రేరేపించడానికి బీజేపీ కుట్ర చేసిందని, అయితే దానిని తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ర్టాలైన యూపీలోని మూక హింస, మణిపూర్లోని అల్లర్ల మాదిరిగా తమిళనాడులో ఎలాంటి కుల కొట్లాటలు, మత హింస జరగ లేదని చెప్పారు. తమిళనాడులో సైతం అలాంటి పరిస్థితిని సృష్టించడానికి బీజేపీ ప్రయత్నించిందని, అయితే తమ పార్టీ దానిని సమర్థంగా ఎదుర్కొన్నట్టు ఆయన తెలిపారు. డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు రూ. 8,000 కూపన్ను అందజేస్తుందని, దానితో మహిళలు తమకు నచ్చిన గృహోపకరణాలను ఉచితంగా కొనుగోలు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. మహిళలకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న నగదు సహాయాన్ని 2,000కు, కళాశాల విద్యార్ధులకు 1,500కు పెంచుతామని స్టాలిన్ హామీనిచ్చారు.