చెన్నై, మార్చి 20: వచ్చే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని తమిళనాడులోని అధికార డీఎంకే కొన్ని సంచలన హామీలతో తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఆమోదంతోనే గవర్నర్ను నియమించే విధానాన్ని అమల్లోకి తెస్తామని పార్టీ చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని, నీట్ పరీక్షను రద్దు చేస్తామని, సీఏఏను తొలగిస్తామని చెప్పారు. అలాగే జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేస్తామని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని, మహిళలందరికీ నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని, రాష్ర్టాలకు సమాఖ్య హక్కులను కల్పించేందుకు భారత రాజ్యాంగంలో మార్పులు తెస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ మ్యానిఫెస్టోను తయారు చేసిన తన సోదరి కనిమొళికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.