అమిత్ షాకు తమిళనాడు
బీజేపీ చీఫ్ అన్నామలై షాక్
తమ రాష్ట్రంలో హిందీని
ఒప్పుకోబోమని స్పష్టీకరణ
హిందీయేతర రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలోనే మాట్లాడుకోవాలి.
– ఇదీ బీజేపీ అగ్రనేత, దేశంలో తనకు ఎదురే లేదన్నట్టు వ్యవహరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట.
మా రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం..
– ఇది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై భాషాభిమానం, ఆత్మాభిమానం
హిందీయేతర రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలోనే మాట్లాడుకోవాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు ఆ పార్టీ నుంచే ధిక్కారం ఎదురైంది. తమ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తేల్చిచెప్పారు. భాషాభిమానం, ఆత్మాభిమానం, ప్రాంతీయ అభిమానం ముందు పార్టీలు, పదవులు తృణప్రాయమని అన్నామలై ధిక్కారం చెప్తున్నది ఇదే.
మరి మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పరిస్థితేమిటి.. 60 లక్షల మంది రైతుల కష్టార్జితమైన వడ్లు ‘కొనం పో..’ అని కేంద్రం తూలనాడితే.. ఆయన రాష్ట్రప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారు. మాతృభాష కోసం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పార్టీ అధిష్ఠానాన్నే ఎదిరిస్తుంటే, మన రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ నేతల ముందు సాగిల పడుతున్నారు.
చెన్నై, ఏప్రిల్ 13: దేశంలోని హిందీయేతర రాష్ర్టాలపై హిందీని బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే ఊహించని షాక్ తగిలింది. హిందీని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తమిళనాడు నుంచే తిరుగుబాటు మొదలైంది. బీజేపీలో తనంతవాడు లేడన్నట్టు చెలరేగిపోతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఊహించని షాకిచ్చారు. తమ రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దుతామంటే ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని మంగళవారం తేల్చి చెప్పారు. ‘ఉపాధి కోసమో, విద్య కోసమో, ఇంకేదైనా పనికోసమో అవసరం ఉంటే హిందీని మేమే నేర్చుకొంటాం. అంతేకానీ బలవంతంగా అమలుచేయాలని చూస్తే మాత్రం ఒప్పుకోం. ఇక్కడ నాతోపాటు ఎవరూ హిందీ మాట్లాడరు. మేం భారతీయులమని నిరూపించుకోవటానికి ఇప్పుడు ఓ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని ఘాటుగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వం రూపొందించిన కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం హిందీయేతర రాష్ర్టాల్లో కూడా హిందీని పాఠశాలల్లో తప్పనిసరి భాషగా బోధించాలి. ఇప్పటివరకు త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ ఐచ్ఛిక భాషగా మాత్రమే ఉన్నది. మోదీ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఒప్పుకొనేదే లే
హిందీని తప్పనిసరి భాషగా చేయాలన్న ప్రతిపాదనను మొదట తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ రాష్ట్రంలో ఏకంగా సొంత విద్యావిధానాన్నే (ఎస్ఈపీ) అమలుచేయటానికి ఓ కమిటీని కూడా వేశారు. అదే దారిలో పశ్చిమబెంగాల్ కూడా నడిచింది. ఎన్ఈపీ సమగ్రంగా లేదంటూ సొంత విద్యావిధానం రూపకల్పనకు మమతాబెనర్జీ సర్కారు నిపుణుల కమిటీని వేసింది. సాంకేతిక విద్యారంగంలో దూసుకుపోతున్న తెలంగాణ విద్యార్థులకు శరాఘాతంలాంటి కేంద్ర నిర్ణయాన్ని తెలం గాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు. హిందీని అమలుచేసే సాకుతో ఇంగ్లిష్ను దూరం చేయటం అసంబద్ధమన్నారు.
ఈశాన్యంలో హిందీ మంట
కేంద్రప్రభుత్వ నిర్ణయం ఈశాన్య రాష్ర్టాల్లో మరోసారి అలజడి రేపింది. కొన్నేండ్ల క్రితం వరకు హిందీ భాష మాట్లాడేవారిపై అస్సాం, నాగాలాండ్ తదితర రాష్ర్టాల్లో తీవ్రమైన దాడులు జరిగేవి. తమ అవకాశాలను ప్రాంతేతరులు తన్నుకుపోతున్నారన్న ఆక్రోశంతో స్థానికులు హింసాత్మక దాడులకు పాల్పడేవారు. దాడుల్లో అనేకమంది హిందీ వలస కార్మికులు చనిపోయారు కూడా. తాజాగా కేంద్ర నిర్ణయాన్ని ఈశాన్య రాష్ర్టాల్లో శక్తిమంతమైన విద్యార్థి సంఘాల కూటమి నెసో తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని 8 విద్యార్థి సంఘాలతో కూడిన నెసో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. పాఠశాలల్లో గతంలో హిందీ ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉండేదని, ఇప్పుడు దానిని తప్పనిసరి చేయటం ద్వారా తమ మాతృభాషలు ప్రమాదంలో పడుతాయని ఆందోళన వ్యక్తంచేసింది.
హిందీని వ్యతిరేకిస్తే దేశద్రోహం కేసు
హిందీని తప్పనిసరి చేయాలన్న అమిత్ షాను విమర్శించినందుకు మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అధికార ప్రతినిధి సనోజమ్ శ్యామ్చరణ్సింగ్పై దేశద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్ 124ఏ (దేశద్రోహం), సెక్షన్ 295 (మత మనోభావాలను కించపర్చేలా మాట్లాడటం), సెక్షన్ 505 (ప్రజా జీవితానికి హాని కలిగించటం) కింద కేసు నమోదుచేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ నెల 9న స్థానిక టీవీ చానల్ చర్చలో పాల్గొన్న సనోజమ్.. అమిత్ షా వ్యాఖ్యలను తప్పుబట్టారు.