చెన్నై, జనవరి 8: తమిళనాడు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి నీట్ని పూర్తిగా రద్దు చేసేందుకు ఐక్య పోరాటం చేయాలని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు డీఎంకే అధినేత, రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానం చేసింది. దీనికి డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో సహా 12 పార్టీలు ఆమోదం తెలుపగా, బీజేపీ మాత్రం సమావేశం నుంచి వాకౌట్ చేసింది. నీట్, జాతీయ మెడికల్ కమిషన్ చట్టం తమిళనాడు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపాయని తీర్మానం పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాల విధానాన్ని నిర్ణయించేందుకు రాష్ర్టాలకు ఉన్న అధికారాన్ని కేంద్రం లాగేసుకుందని, ఇది రాష్ర్టాల స్వయం ప్రతిపత్తికి విరుద్ధమని మండిపడింది. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. నీట్ అనేది తమిళనాడు సమస్య, తమ విద్యార్థుల సమస్య అని పేర్కొన్నారు. నీట్ కోచింగ్ కోసం అయ్యే భారీ ఖర్చును ఎంత మంది భరిస్తారు? అని ప్రశ్నించారు. ప్రవేశ పరీక్షలను రద్దు చేయడం ద్వారా పేదలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోంమంత్రిని కూడా కలవాలని అఖిలపక్షం నిర్ణయం తీసుకున్నది.