చెన్నై : తనతో ఐదేండ్ల పాటు సంబంధం కొనసాగించి ఆపై మోసగించాడని తమిళనాడు మాజీ మంత్రి ఎం మణికందన్ పై నటి శాంతిని థెవ ఆరోపించారు. తనను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికిన మణికందన్ తాను గర్భం దాల్చగానే వదిలేశాడని వెల్లడించారు. మణికందన్ తనకు బలవంతంగా అబార్షన్ చేయించడమే కాకుండా తన కుటుంబ సభ్యులను బెదిరించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. మరోవైపు తనపై తమిళ నటి ఆరోపణలను మణింకదన్ తోసిపుచ్చారు. అసలు శాంతిని ఎవరో తనకు తెలియదని అన్నాడు. ఇక మణికందన్ పై ఆమె శుక్రవారం చెన్నైలో డీసీపీకి ఫిర్యాదు చేశారు.
డీసీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం నటి విలేకరులతో మాట్లాడుతూ ఫిర్యాదు ప్రతిని అందించారు. తాను 2017లో అప్పటి ఏఐఏడీఎంకే సర్కార్ లో మణికందన్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనను కలిశానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పటికే మణికందన్ కు వేరొక మహిళతో వివాహమైనా తనను పెండ్లి చేసుకుంటానని నమ్మబలికాడని శాంతిని ఆరోపించారు. తాము అప్పటినుంచి చెన్నైలోని బసంత్ నగర్ లో సహజీవనం చేస్తున్నామని దీనికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని చెప్పారు. ఈ క్రమంలో తాను మూడుసార్లు గర్భం దాల్చినా వివాహమైన తర్వాత సంతానం కోరుకుందామని చెబుతూ అబార్షన్ చేయించాడని ఆరోపించారు.
తామిద్దరం కలిసి దేశంలో పలు ప్రాంతాలు తిరిగామని అన్నారు. ఏప్రిల్ 2021లో తమ సంబంధానికి మణికందన్ దూరమయ్యాడని, అదే సమయంలో దేశం విడిచివెళ్లాలని తనపై ఒత్తిడి తెచ్చాడని ఆమె ఆరోపించారు. తాను చెప్పినట్టు చేయకుంటే తన నగ్న చిత్రాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తానని తనను తన కుటుంబ సభ్యులను బెదిరించాడని అన్నారు. తనను శారీరకంగా వేధించే క్రమంలో మణికందన్ కు ఆయన సన్నిహిత అనుచరుడు కూడా సహకరించాడని ఆమె ఆరోపించారు.