న్యూఢిల్లీ, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం అభినందనీయనమని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ వెంకట్ కొనియాడారు. మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తున్నదని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని విమర్శించారు.
పంటలను కొనుగోలు చేయాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. రైతాంగాన్ని పట్టించుకోని కేంద్రం, అదానీలాంటి పెట్టుబడిదారులకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాల నుంచి రూ.లక్షలాది కోట్ల నిధులను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతాంగం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.