ఉపవాస దీక్షకు భంగం కాదు.. ముస్లిం విద్యావేత్తల స్పష్టీకరణ
శ్రీనగర్/లక్నో: ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్ష సమయంలో కరోనా టీకాను వేయించుకోవచ్చని ఆ మతానికి చెందిన విద్యావేత్తలు సూచించారు. టీకా వేయించుకోవడం వల్ల రంజాన్ ఉపవాసం చెల్లకుండా పోదని స్పష్టం చేశారు. ఈ మేరకు లక్నోలోని ప్రముఖ ఇస్లామిక్ ఆధ్యాత్మిక విద్యా సంస్థ ఫరంగి మహల్ ఓ ఫత్వా జారీ చేసింది. ‘టీకా రక్తనాళాల్లోకి వెళుతుందే కానీ కడుపులోకి వెళ్లదు. కాబట్టి అది ఉపవాసానికి భంగం కలిగించద’ని తెలిపింది. టీకా ఆహారం కానీ పానీయం కానీ కాదని, అందుచేత ముస్లింలు ఆందోళనను విడిచిపెట్టి ఉపవాస సమయంలో కూడా టీకా వేయించుకోవచ్చని జమ్ముకశ్మీర్కు చెందిన గ్రాండ్ ముఫ్తీ నాజిర్-ఉల్-ఇస్లాం తెలిపారు. ఉపవాస సమయంలో ఇంజక్షన్లను, టీకాలను ముస్లిం మతం అనుమతిస్తుందని మరో విద్యావేత్త ముఫ్తీ జియా-ఉల్-హక్ పేర్కొన్నారు.