Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత సువేందు అధికారి సన్నిహితుడు, పీఏ చంద్రనాథ్ రాత్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి అతడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని మధ్యగ్రామ్లో చంద్రనాథ్ను కాల్చి చంపారు. హత్య అనంతరం నిందితులు పారిపోయారు. వారి కోసం ఇంకా వెతుకులాట కొనసాగుతోంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి, విచారణ ప్రారంభించారు.
దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. పక్కా ప్రణాళిక ప్రకారమే చంద్రనాథ్ హత్య జరిగింది. అతడిపై దాదాపు పది రౌండ్లు, అంతకంటే ఎక్కువే కాల్పులు జరిపారు. ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురు స్తానిక రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన చాలా పకడ్బందీగా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అంచనా ప్రకారం.. ముందుగా రెక్కీ నిర్వహించారు. అలాగే, హత్య అనంతరం పారిపోయే రూట్లను ఎంచుకున్నారు. ఘటన సయమంలో చంద్రనాథ్ ప్రయాణిస్తున్న స్కార్పియోను రెండు వాహనాలు అనుసరించాయి.
ఒకటి సిల్వర్ కలర్ శాంట్రో కార్, రెండోది ఒక బైక్. ముందుగా కారు స్కార్పియోను దాటింది. ఆ కారు స్లోగా కదలడంతో వెనుక ఉన్న స్కార్పియో కూడా స్లో అయింది. వెంటనే బైకుపై ఉన్న దుండగులు అతి సమీపంనుంచి స్కార్పియోలోని చంద్రనాథ్పై కాల్పులు జరిపారు. దాదాపు పది రౌండ్ల కాల్పులు జరిపారు. చాతి, తల, కడుపు, ఇలా అనేక చోట్ల బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో తీవ్ర గాయాలుకాగా, అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఉపయోగించిన బైకుకు నెంబర్ ప్లేట్ లేదు.
ఈ ఘటనలో చంద్రనాథ్ ప్రయాణించిన స్కార్పియో డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.