Tahawwur Rana | 2008 ముంబై ఉగ్రదాడుల (Mumbai Attack) సూత్రధారి తహవూర్ రాణా (Tahawwur Rana) త్వరలో భారత్కు రానున్నట్లు తెలిసింది. రేపు ఉదయం భారత్కు తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ మేరకు ఢిల్లీ, ముంబైలోని రెండు జైళ్లలో అధిక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. తహవూర్ రాణా భారత్లోకి వచ్చిన తర్వాత విచారణ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆయన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
64 ఏళ్ల తహవూర్ రాణా (Tahawwur Rana) పాకిస్థాన్ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా అతడిని గుర్తించారు. ప్రస్తుతం రాణా లాస్ ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. ఇక అతడి అప్పగింత విషయమైన భారత్ న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఈ క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూర్ పలు ఫెడరల్ కోర్టుల్లో సవాల్ చేశాడు. తనను భారత్కు అప్పగించొద్దంటూ పిటిషన్లు వేశాడు. అయితే, రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడు చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత దేశానికి పంపించాలని జారీ అయిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు తీర్పుతో ఆయనను భారత దేశానికి రప్పించడానికి మార్గం సుగమం అయింది.
16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో తహవూర్ రాణా ప్రధాన సూత్రదాడిగా తేలాడు. రాణాకు పాక్లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకు ఉన్నది.
Also Read..
“తహవుర్ రాణా అప్పగింతకు లైన్ క్లియర్”
“Tahawwur Rana: తహవుర్ రాణా స్టే పిటీషన్ను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు”
“భారత్కు అప్పగిస్తే చిత్రహింసలు పెడతారు!”