Tahawwur Rana | తహవూర్ రాణా (Tahawwur Rana).. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరే వినిపిస్తోంది. అందుకు కారణం 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి కేసులో (Mumbai terror attacks) అతను ప్రధాన సూత్రదారి. ఈకేసులో అరెస్టైన అతడు అమెరికా లాస్ ఏంజెల్స్ జైల్లో ఇన్ని రోజులూ శిక్ష అనుభవించాడు. ఈ కేసులో అతడిని అమెరికా అధికారులు భారత్కు అప్పగించారు. తహవూర్ రాణాతో యూఎస్లో బయల్దేరి స్పెషల్ ఫ్లైట్ మరికాసేపట్లో భారత్లో ల్యాండ్ కానుంది. ఈ నేపథ్యంలో తహవూర్ రాణా ఎవరు..? అంటూ అంతా ఆరా తీస్తున్నారు.
64 ఏళ్ల తహవూర్ రాణా (Tahawwur Rana) పాకిస్థాన్ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. జనవరి 12, 1961న పాకిస్థాన్లోని చిచావత్నీలో జన్మించాడు. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే ముందు పాక్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో కెప్టెన్గా పనిచేశాడు. అతను ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థను కూడా నిర్వహించాడు. బిజినెస్మ్యాన్గా చికాగోలో సెటిల్ అయ్యాడు. చికాగాలో ఉన్న రాణా ఇమ్మిగ్రేషన్ సెంటర్తో పాటు ముంబైలో ఉన్న ఆఫీసును ఉగ్ర కార్యకలాపాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 26/11 ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు అయిన పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాడులకు ముందు కొన్ని రోజులు హెడ్లీ ముంబయిలో రెక్కీ నిర్వహించాడు. అతడికి రాణా సహకరించినట్లు చెబుతున్నారు. ముంబయిలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది. అంతేకాదు రాణాకు పాక్లోని లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఉగ్ర సంస్థలతో లింకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
16 ఏళ్ల క్రితం అంటే 2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడ్డారు. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు.
అప్పటి నుంచి రాణా లాస్ ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది. రాణా అప్పగింతపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సైతం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ (India)కు అప్పగిస్తున్నాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’ అని వెల్లడించారు.
ఇక అతడి అప్పగింత విషయమైన భారత్ న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఈ క్రమంలో భారత్ ప్రయత్నాలను తహవూర్ పలు ఫెడరల్ కోర్టుల్లో సవాల్ చేశాడు. తనను భారత్కు అప్పగించొద్దంటూ పిటిషన్లు వేశాడు. అయితే, రాణా చేసిన పిటిషన్లు అమెరికా ఫెడరల్ కోర్టులు తిరస్కరిస్తూ వచ్చాయి. దీంతో అతడు చివరి ప్రయత్నంగా గతేడాది అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత దేశానికి పంపించాలని జారీ అయిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు తీర్పుతో ఆయనను భారత దేశానికి రప్పించడానికి మార్గం సుగమం అయింది. ఇక రాణాపై నేరపూరిత కుట్ర, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం, హత్య, ఫోర్జరీతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
Also Read..
“Mumbai attack | అప్పుడు ఆ ఉగ్రవాదులిద్దరూ 231 సార్లు మాట్లాడుకున్నారట..!”
“Tahawwur Rana | రేపు ఉదయం భారత్కు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రాణా”