UP Polls 2009 సంవత్సరం నుంచి ఈ ఇద్దరి మధ్యా భీకరమైన రాజకీయ యుద్ధం సాగుతోంది. ప్రస్తుతం 2022 సంవత్సరం. అంటే 12 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆ రాజకీయ ప్రత్యర్థులు బలమైన పాచికలను వేస్తూనే వున్నారు. ఆ ప్రత్యర్థులిద్దరూ ప్రస్తుతం పార్టీలు మారిపోయారు. వారిద్దర్నీ ఉపయోగించుకొంటూ ఆ పార్టీలు తమ బలాన్ని పెంచుకోవాలని బరిగీశాయి. అందులో ఒకరు స్వామి ప్రసాద్ మౌర్య. మొన్ననే బీజేపీకి గుడ్బై చెప్పేసి, సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఇక రెండో వ్యక్తి ఆర్పీఎన్ సింగ్. యూపీ కాంగ్రెస్ దిగ్గజుల్లో ఒకరు. మంగళవారమే కాంగ్రెస్కు గుడ్బై చెప్పి, బీజేపీలో చేరారు. స్వామి ప్రసాద్ మౌర్య సరిగ్గా ఎన్నికల సమయంలో బీజేపీకి ఝలక్ ఇచ్చారు. ఈ ఝలక్ను పూడ్చుకోవాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కోవలోకే ఆర్పీఎన్ సింగ్ వచ్చి చేరారు. కాంగ్రెస్కు గుడ్బై చెప్పేసి, ఆయన బీజేపీలో చేరారు.
ఆర్పీఎన్ సింగ్, స్వామి ప్రసాద్ మౌర్య మధ్య రాజకీయ వైరం 2009 నుంచే కొనసాగుతోంది. ఖుషీనగర్ నియోజకవర్గంలో ఈ ఇద్దరూ భిన్న ధృవాలుగా చెలమాణి అవుతున్నారు. వీరిద్దరి మధ్య రాజకీయ పోటీ 2009 లో ప్రారంభమైంది. 2009 లో స్వామి ప్రసాద్ మౌర్య మాయావతి కేబినెట్లో కీలక మంత్రిగా ఉంటూ చక్రం తిప్పుతున్నారు. ఆ సమయంలో ఆయన లోక్సభ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి ఆర్పీఎన్ సింగ్ బరిలోకి దిగారు. ఆ సమయంలోనే స్వామి ప్రసాద్ మౌర్యను ఆర్పీఎన్ సింగ్ ఓడించారు. దీంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్లో ఆర్పీఎన్ సింగ్ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే స్వామి మౌర్య రెండో స్థానంలో నిలిచారు. ఓ రకంగా గట్టిపోటీ ఇచ్చారనే చెప్పాలి.
సింగ్ఃకు 2.23 లక్షల ఓట్లు వస్తే, స్వామి మౌర్యకు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. అయితే ఆర్పీఎన్ సింగ్ ఎంపీగా గెలవడంతో ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేయడం ప్రారంభించారు. అయినా… నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని సంకల్పించారు. ఆయన తల్లి మోహిని దేవీని పద్రౌనా నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. ఇక బీఎస్పీ నుంచి స్వామి ప్రసాద్ మౌర్య కూడా బరిలోకి దిగారు. ఈ పోటీలో స్వామి ప్రసాద్ మౌర్య గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వామి ప్రసాద్ మౌర్యనే గెలుపొందారు.
అప్పటి నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం స్వామి మౌర్య సమాజ్వాదీ పార్టీలో వున్నారు. ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ను వీడి, బీజేపీలో చేరారు. ఇద్దరూ పద్రౌనా నియోజకవర్గం పైనే కన్నేశారు. పార్టీలూ అంతే. స్వామి ప్రసాద్ మౌర్యను దెబ్బకొట్టడానికి బీజేపీ సింగ్ను రంగంలోకి దింపింది. బీజేపీని ఓడించడానికి స్వామి ప్రసాద్ మౌర్యను సమాజ్వాదీ ఉసిగొల్పుతోంది. అయితే ఇద్దరూ గట్టి ఉద్ధండులే. 1996,2002,2007 లో సింగ్ పద్రౌనా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ స్వామి ప్రసాద్ మౌర్యపై ఆర్పీఎన్ సింగ్ను బీజేపీ రంగంలోకి దింపనుంది.