ముంబై : మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్గఢ్ జిల్లా శ్రీవర్ధన్లో అనుమానాస్పద బోటు కనిపించడంతో జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్లతో పాటు కాట్రిజ్డ్లు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా పోలీసులు దిగ్బంధించారు. దీంతో పాటు హరిహరేశ్వర్లో ఓ చిన్న బోటు కనిపించగా, అందులో లైఫ్ జాకెట్, కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికాయి.
దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమాచారం ప్రకారం.. శ్రీవర్ధన్లోని హరిహరేశ్వర్, భరద్ఖోల్ వద్ద పడవలు గుర్తించారు. హరిహరేశ్వర్ వద్ద పడవలో రెండు-మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు లభ్యమయ్యాయి. రెండు పడవల దగ్గర ఎవరూ కనిపించలేదు. అధికారులు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ హెడ్కు వివరించగా.. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. పడవలో రైఫిళ్లు, బుల్లెట్లు లభించడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఎవరైనా ఉగ్రవాదులు ముంబైలో 26/11 వంటి దాడికి కుట్ర చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే తరహాలో గుజరాత్ పోర్బందర్లో అనుమానిత పడవను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పడవ ఎక్కడి నుంచి వచ్చింది? అందులో దొరికిన ఆయుధాలు ఎవరు పంపారు? పడవలో ఎవరైనా వచ్చారా?.. ఎవరైనా వస్తే ఇప్పుడు ఎక్కడున్నారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.