జైపూర్, డిసెంబర్ 4: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత.. కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కమలం పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోని నేపథ్యంలో రేసులో ఉన్న పలువురు నేతలు వ్యూహత్మక మౌనం పాటిస్తూ సీఎం సీటును దక్కించుకొనేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలు మోదీ, అమిత్షా, నడ్డాలతో చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, ఇన్చార్జి అరుణ్ సింగ్ ఢిల్లీ చేరుకొన్నారు.
మరికొందరు సీనియర్ నేతలు, ఎంపీలు కూడా చేరుకొంటున్నారు. ఓవైపు సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సమాలోచనలు చేస్తున్న తరుణంలో సోమవారం మాజీ సీఎం వసుంధరా రాజేను ఆమె నివాసంలో కొత్తగా గెలిచిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు కలువడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. భేటీ అనంతరం ఎమ్మెల్యే రామ్స్వరూప్ లంబా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ విజయానికి ప్రధాని మోదీ, వసుంధరా రాజే ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. రాజేకు కొత్తగా గెలిచిన 115 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. అయితే ఎమ్మెల్యేలంతా కేవలం మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారని వసుంధరా రాజే కార్యాలయం చెప్పడం గమనార్హం.