Congress | న్యూఢిల్లీ : బీఎస్పీ బహిష్కృత నేత, లోక్సభ ఎంపీ డానీష్ అలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అగ్ర నాయకత్వం సమక్షంలో డానీష్ అలీ హస్తం పార్టీలో చేరారు. డానీష్ అలీకి ఏఐసీసీ నాయకుడు అవినాష్ పాండే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డానీష్ అలీ మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. విభజన శక్తులపై పోరాడాలంటే మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలన్నారు. విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గతేడాది డానీష్ అలీని బీఎస్పీ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం డానీష్ యూపీలోని అమ్రోహా నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అలీ పోటీ చేయనున్నారు.