న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాహుల్గాంధీ చేసిన అప్పీల్ను తిరస్కరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ప్రధాని మోదీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ 2019లో రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలుకాగా, ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్గాంధీని దోషిగా తేల్చుతూ రెండేండ్ల జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాల్ చేసుకోవడానికి కోర్టు 30 రోజుల గడువుతో బెయిల్ మంజూరు చేసింది. తీర్పును సవాల్ చేస్తూ ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. జైలు శిక్ష తీర్పును నిలిపివేయాలని, పైకోర్టులో తీర్పు వెలువడేవరకూ తనను దోషిగా తేల్చటాన్ని ఆపాలని కోరుతూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయస్థానం తనపై కఠినమైన శిక్షను విధించిందని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను రద్దు చేయకపోతే, తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదనలు వినిపించారు. అయితే సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మోజేరా.. రాహుల్ వాదనలను తోసిపుచ్చారు.