Waqf Law | వక్ఫ్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా.. సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ వరకు అప్పటి వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు.
ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉందన్నారు. గ్రామాలకు గ్రామాలను వక్ప్ ఆస్తులుగా, వ్యక్తిగత ఆస్తులను తీసుకున్నారన్నారు. ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించాలన్న అభిప్రాయంపై ఆయన స్పందిస్తూ.. చట్టంపై స్టే విధించడం కఠినమైన నిర్ణయమవుతుందని అభిప్రాయపడ్డారు. కోర్టు ఎదుట కొన్ని పత్రాలతో ప్రాథమిక సమాధానం దాఖలు చేసేందుకు వారం రోజులు సమయం కావాలని కోరారు. అప్పటి వరకు బోర్డు, కౌన్సిల్ నియామకం ఉండదని సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందిస్తూ తాము పరిస్థితి మారిపోవాలని కోరుకోవడం లేదని.. ఐదేళ్ల వరకు ప్రొవిజెన్స్ ఉన్నాయని తమకు తెలుసునన్నారు. వాటిని తాము స్టే చేయబోవడం లేదన్నారు. మళ్లీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ తమ వాదనలు వినాలని సీజేఐని కోరారు. వారం రోజుల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తాము ఎలాంటి నాయమకాలు చేపట్టబోమన్నారు. మళ్లీ సీజేఐ జోక్యం చేసుకుంటూ తదుపరి విచారణ వరకు ఎలాంటి మార్పులుండొద్దని చెప్పగా.. ఎస్జీ మెహతా స్పందిస్తూ ఏ రాష్ట్రమైనా నియామకాలు చేస్తే చట్టబద్ధంగా పరిగణించకూడదన్నారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎస్జీ వ్యాఖ్యలు రికార్డు చేసినట్లు పేర్కొంది. కౌన్సిల్, బోర్డులో ఎలాంటి నియామకాలు జరుగవని ఎస్జీ కోర్టుకు హామీ ఇచ్చారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణ వరకు ఎలాంటి నియామకాలు జరగకూడదని.. యూజర్ వై వక్ఫ్గా పేర్కొన్న వాటితో పాటు నోటిఫికేన్ ద్వారా రిజిస్టర్ అయినవి, డీ నోటిఫై చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పిటిషన్లు దాఖలు కాగా.. అన్నింటిని పరిగణలోకి తీసుకోవడం అసాధ్యమని ధర్మాసనం పేర్కొంది. ఎవరెవరు వాదనలు వినిపించాలో.. న్యాయవాదులు తమలో తాము నిర్ణయించుకోవాలని.. తాము కేవలం ఐదు పిటిషన్లను మాత్రమే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.