న్యూఢిల్లీ, మార్చి 18: ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించడానికి సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా నాలుగు వారాల్లో తమ స్పందనను తెలియజేయాలని జస్టిస్లు సంజయ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఆదేశించింది.
అనర్హత వేటు పడ్డ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యకలాపాల్లో పొల్గొనడానికి, ఓటు వేయడానికి అనుమతించరాదని పేర్కొంది. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది హరీశ్ సాల్వే ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కోర్టు దానిలో జోక్యం చేసుకోదని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ అన్నారు. సాధారణంగా ఏదైనా వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరు వాదనలు విన్న తర్వాత పిటిషనర్లు వారంలోగా తమ సమాధానాన్ని దాఖలు చేయవచ్చునని పేర్కొంటూ కేసును మే 6కి వాయిదా వేసింది.
కాగా, ఈ ఆరు స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. హిమాచాల్లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడంతో ఫిబ్రవరి 29న అసెంబ్లీ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై స్పీకర్ తమకు ఇచ్చిన నోటీస్పై స్పందించడానికి తగిన సమయం ఇవ్వకుండానే తమపై అనర్హత వేటు వేశారంటూ ఎమ్మెల్యేలు ఆరోపించారు.