Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గత ఐదు నెలలుగా జైల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకు ఊరట లభించడం లేదు. ఈ క్రమంలో కేజ్రీ బెయిల్ విషయంపై సుప్రీంకోర్టు (Supreme Court) రేపు కీలక తీర్పు వెలువరించనుంది.
మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను (CBI case) అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తనకు బెయిల్ ఇవ్వాలంటూ అభ్యర్థించారు. దీనిపై గత గురువారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. దీంతో ఈ తీర్పుపై ఆప్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేజ్రీకి ఊరట దక్కుతుందో లేదో చూడాలి.
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీ (గురువారం)న సుధీర్ఘంగా విచారించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో అసలు కేజ్రీవాల్ పేరు లేదని సింఘ్వీ వాదించారు. ఇటీవల కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సీఎం సమాజానికి ప్రమాదకరమేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొందని, బెయిల్పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని ధర్మాసనానికి తెలిపారు. ఒకసారి ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు కేజ్రీవాల్ను బెయిల్పై విడుదల చేసిందని, మరోసారి ఈడీ కేసులో బెయిల్ లభించిందని చెప్పారు. కేజ్రీవాల్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని.. సమాజానికి ప్రమాదం లేదని వాదించారు. రెండేళ్లుగా సీబీఐ ఆయనను అరెస్టు చేయలేదని.. అయితే, జూన్ 26న మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ ఒకరకంగా ఇన్సురెన్స్ అరెస్ట్ అని ఆరోపించారు.
సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. బెయిల్ కోసం మొదట ట్రయల్ కోర్టుకు వెళ్లాలని.. నేరుగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడంపై అభ్యంతరం తెలిపారు. సీఎం ప్రత్యేకమైన వ్యక్తి అని.. అందుకు భిన్నమైన పద్ధతిని అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని ఏసీజీ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతో పాటు రెండో పిటిషన్లో బెయిల్ కోసం అప్పీల్ చేశారు. ఇంతకు ముందు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాల్సిందిగా కోరింది. హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకిస్తూ బెయిల్పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది.
కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత జూలైలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. అయితే ఈడీ కేసులో సుప్రీంకోర్టు జూలై 12న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో మాత్రం ఇంకా జైల్లోనే కొనసాగుతున్నారు. తీహార్ జైల్లో (Tihar Jail) జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు కేజ్రీ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు పొడిగిస్తూ వస్తోంది. తొలుత ఆగస్టు 27, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 11 వరకు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ గడువు పొడిగించారు. బుధవారం కూడా మరోసారి కస్టడీని పొడిగించారు. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది.
Also Read..
Vinesh Phogat | నాలుగు లగ్జరీ కార్లు.. రూ.కోట్ల ప్రాపర్టీ.. వినేశ్ ఫోగట్ ఆస్తుల వివరాలు ఇవే..
Mahabubabad | తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రహదారిపై మహిళల నిరసన : వీడియో
PM Modi | సీజేఐ ఇంట గణపతి పూజ.. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న ప్రధాని మోదీ