Supreme Court | సుప్రీంకోర్టు తీర్పు కాపీలు త్వరలో హిందీతో సహా ఇతర అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి. ముంబయి దాదర్లోని యోగి ఆడిటోరియంలో శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా (బీసీఎంజీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు సత్వర న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. దేశ పౌరుడు తనకు అర్థమయ్యే భాషలో కోర్టు తీర్పులకు సంబంధించిన సమాచారాన్ని పొందనంత వరకు.. న్యాయ వ్యవస్థ అర్థవంతంగా ఉండదన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో న్యాయస్థానాల్లో విస్తృతమైన మార్పు తీసుకురావచ్చని సీజేఐ అభిప్రాయపడ్డారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సుప్రీంకోర్టు తీర్పులను ప్రతి భాషలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోర్టులను పేపర్లెస్, సాంకేతికత ప్రారంభించడం తన లక్ష్యమన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యంపై అభినందనలు తెలుపుతూ.. యువకులు, కొత్త న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ గంగాపూర్వాలా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, సిట్టింగ్, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ చైర్మన్ మిల్లింగ్ థోబ్డే, బీసీఎంజీ కార్యదర్శి ప్రవీణ్ రాన్పీస్, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.