న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఎన్నికల ఓటింగ్ను తిరిగి పేపర్ బ్యాలెట్ పద్ధతికి తీసుకెళ్లాలన్న పిటిషనర్ ఏడీఆర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనపై న్యాయస్థానం ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ వినియోగం విషయంలో పలు సమస్యలు ఉన్నాయని పేర్కొన్నది. ‘మనం 60 ఏండ్ల వయసులో ఉన్నాం. బ్యాలెట్ పేపర్లు ఉన్న సమయంలో ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. మీరు మర్చిపోయినా, మేం మర్చిపోలేదు’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు.
ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. పోలింగ్ పారదర్శకంగా ఉండాలంటే పేపల్ బ్యాలెల్ పద్ధతికి తిరిగి వెళ్లాలని లేదా వీవీప్యాట్ యంత్రం గ్లాస్ను పారదర్శకంగా ఉండేలా చూడాలని లేదా వీవీప్యాట్ స్లిప్ను ఓటర్కు ఇచ్చి, దాన్ని బ్యాలెట్ బాక్స్లో వేసే పద్ధతికి తీసుకురావాలనే సూచనలు చేశారు. తమ ఓటు రికార్డు అయిందని తెలిపేలా వీవీప్యాట్ ద్వారా వెరిఫై చేసుకోనే సదుపాయం ఓటర్లకు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏడీఆర్ కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.