న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంపై తరచూ విమర్శలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు.. మాటల దాడిని మరింత పెంచారు. పలువురు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) నివేదికలను సుప్రీంకోర్టు కొలీజియం వెబ్సైట్లలో పెట్టడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. దర్యాప్తు సంస్థల నివేదికల్లో అత్యంత సున్నితమైన అంశాలు ఉంటాయని, అలాంటి వాటిని ప్రజాబాహుళ్యంలో ఉంచడం సరికాదని వ్యాఖ్యానించారు. నిఘా సంస్థల అధికారులు దేశం కోసం రహస్యంగా పనిచేస్తారని, తమ నివేదికలు బయటికివస్తున్న క్రమంలో.. ఇకపై వారు భవిష్యత్తులో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇది తగిన సమయం కాదు..
హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గతంలో పలువురి పేర్లు ప్రతిపాదించింది. అయితే ఆయా వ్యక్తులపై ఐబీ, రా సంస్థలు ఇచ్చిన నివేదికలను తిరస్కరిస్తూ కొలీజియం వారి పేర్లను మరోసారి కేంద్రానికి పంపింది. ఈ మేరకు నిఘా సంస్థలకు సంబంధించిన నివేదికల్లోని పలు భాగాలను సుప్రీంకోర్టు కొలీజియం తన తీర్మానాల ద్వారా గతవారం బహిరంగపరిచింది. దీనిపై ఢిల్లీలో జరిగిన కేంద్ర న్యాయశాఖ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి రిజిజు స్పందిస్తూ ‘ఐబీ, రా నివేదికలను పబ్లిక్ డొమైన్లో పెట్టడం తీవ్రమైన అంశం. దీనిపై తగిన సమయంలో స్పందిస్తా’ అని అన్నారు.
మోదీపై విమర్శలు.. నియామకం రిజెక్ట్
న్యాయవాది ఆర్ జాన్సత్యం ప్రధాని మోదీని విమర్శించేలా గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులపై ఐబీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నివేదిక అందజేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియామకాన్ని కేంద్రం పక్కనబెట్టింది. జాన్సత్యం పేరును న్యాయమూర్తిగా పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఐబీ తన నివేదికలో పేర్కొన్న ‘ప్రతికూల కామెంట్ల’ను ప్రస్తావించింది. అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు జడ్జీగా న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరు సిఫారుకు సంబంధించి ‘రా’ నివేదికలో ఇచ్చిన సమాచారాన్ని కూడా పేర్కొన్నది. న్యాయమూర్తిగా కిర్పాల్ పేరును కూడా కొలీజియం మరోసారి పంపడం గమనార్హం. కాగా, కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని రిజిజు అభిప్రాయపడ్డారు.
గుప్పిట పెట్టుకునేందుకు కేంద్రం యత్నం
న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ప్రజలు ఈ ప్రయత్నాలను అనుమతించబోరని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇటీవల న్యాయవ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దేశంలోని అన్ని స్వతంత్ర సంస్థలను గుప్పిట పెట్టుకున్న కేంద్రం.. ఇప్పుడు న్యాయవ్యవస్థను గుప్పిట పట్టేందుకు యత్నిస్తున్నదని అన్నారు. న్యాయవ్యవస్థపై ఇలాంటి చర్యలు ఏ మాత్రం తగదని హితవు పలికారు.