Jallikattu | న్యూఢిల్లీ, మే 18: జల్లికట్టు తమిళ సంస్కృతిలో భాగమని, కంబళ, ఎడ్ల బండి పోటీలు కూడా ఆయా రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలలో భాగమేనని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలు ఆయా రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలకు చెందినవని, వాటి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తమిళనాడులో పొంగల్ సందర్భంగా జరిగే సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఏండ్లుగా పోరాడుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
జల్లికట్టుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జంతు హింస నిరోధక చట్ట సవరణకు ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. జల్లికట్టు తమిళ సంస్కృతిలో భాగమని, జంతు హింస నిరోధక చట్టం పరిధిలోకి రాదని తెలుపుతూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్పై తమ తీర్పును వెలువరించింది. 2014లో ద్విసభ్య ధర్మాసనం జల్లికట్టును నిషేధిస్తూ వెలువరించిన తీర్పును తాజాగా రాజ్యాంగ ధర్మాసనం సవరించింది. జల్లికట్టులో హింస ఉన్నప్పటికీ, జంతువులను హింసించి వినోదం పొందే రక్త క్రీడగా పేర్కొనలేమని వ్యాఖ్యానించింది. కర్ణాటకలో నిర్వహించే కంబళ, మహారాష్ట్రలో జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీం తెలిపింది. ఈ చట్టాలు చెల్లవంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కొట్టివేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పలు రాజకీయ పార్టీలు తీర్పును స్వాగతించాయి. అయితే జంతు ప్రేమికులు, పెటా లాంటి సంస్థలు మాత్రం తీర్పును ఆక్షేపించాయి.
2017లో చట్ట సవరణ…
జల్లికట్టు, కంబళ, ఎడ్ల బండ్ల పోటీలపై దశాబ్ద కాలంగా వివాదం నడుస్తున్నది. 2014లో జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీం ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో 2016లో కేంద్ర ప్రభుత్వం జంతు హింస నిరోధక చట్టం నుంచి జల్లికట్టు తదితర క్రీడలను మినహాయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక శాసనసభలు జల్లికట్టు, కంబాల, ఎడ్ల బండ్ల పోటీలను జంతు హింస నిరోధక చట్టం నుంచి మినహాయిస్తూ చట్ట సవరణ చేశాయి. ఈ క్రీడలు తమ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమని పేర్కొన్నాయి. దీంతో వీటిని వ్యతిరేకిస్తూ జంతు ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీం తాజాగా చట్టాలను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ తీర్పు: స్టాలిన్
చెన్నై: జల్లికట్టును అనుమతిస్తూ సుప్రీం వెలువరించిన తీర్పుపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగిన తీర్పు అని అభివర్ణించారు. 2024 పొంగల్ సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి తీర్పును స్వాగతించారు. ఈ ఘనత దివంగత జయలలిత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఎడ్ల బండ్ల పోటీలను జంతు హింస నిరోధక చట్టాల నుంచి మినహాయించినందుకు హర్షం వ్యక్తం చేసింది.