న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 17న ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం పేర్కొన్నది. ముందుగా ఈ పిటిషన్ను ఈ నెల 24న లిస్టింగ్ చేసేందుకు బెంచ్ అంగీకరించగా.. ఇప్పటికే ఇదే అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై దాఖలైన మరో రెండు పిల్స్ను ఈ నెల 17కు లిస్టింగ్ చేసిన అంశాన్ని పిటిషన్దారు తరపు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో అదే రోజున విచారణ చేస్తామని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ తన పిల్లో కోరారు. అదానీ ఎంటర్ప్రైజెస్లో ఎల్ఐసీ, ఎస్బీఐ పెట్టుబడులు పెట్టడంపైనా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.