న్యూఢిల్లీ: శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోలేమని, అసెంబ్లీ స్పీకర్ సహేతుక వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా 16 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై గురువారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై తాము సాధారణ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేమని, ఈ కేసులో అసాధారణ పరిస్థితులు లేవని, కాబట్టి స్పీకరే నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొన్నది. అనర్హతపై నిర్ణయాన్ని డిప్యూటీ స్పీకర్ తీసుకునేలా ఆదేశించాలని కోరినా కోర్టు అంగీకరించలేదు.