Supreme Court | ఏదైనా నేరం జరిగిన సమయంలో సదరు నేరాన్ని రుజువు చేసేందుకు ప్రత్యక్ష సాక్షులు లేని సమయంలో.. కనీసం ఘటనకు ప్రేరేపించిన కారణమైనా రుజువు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2008లో జరిగిన హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తిని నిర్దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు విడుదల చేస్తూ తీర్పు వెలువరించింది. ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు లేకుంటే.. నేరానికి గల కారణాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
కేసు వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ వ్యక్తి తన మేనల్లుడిని హత్య చేశారంటూ 2008లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విధుల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో తన మేల్లుడిని అతని స్నేహితుడు చంపాడని, తాను ఘటనా స్థలానికి వెళ్లే సరికే పారిపోయాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు నిందితుడు హత్యకు ఉపయోగించిన ఆయుధం దొరికింది. ఆ తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు. తర్వాత విచారణ జరిపిన ఛత్తీస్గఢ్ హైకోర్టు సదరు వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. అయితే, సదరు వ్యక్తి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మృతుడి మామ ఇచ్చిన వాంగ్మూలాన్ని నమ్మశక్యంగా లేదని, అతడు ఇచ్చిన వాంగ్మూలంతో శిక్ష విధించలేమని, నేరారోపణకు ఇది సరైన ఆధారం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
కేసులో హత్య చేస్తుండగా ప్రత్యక్ష సాక్షులెవరూ లేరని, ప్రత్యక్ష సాక్షులు ఉన్న సమయంలో నేరారోపణకు కారణాలను చూపించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ప్రత్యక్ష సాక్షులు లేని సమయంలో హత్యకు సంబంధించిన కారణం కీలకంగా మారుతుందని, దాన్ని ప్రాసిక్యూషన్ నిరూపించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. ‘మృతుడికి, నిందితుడికి ఎలాంటి శత్రుత్వం లేదని సాక్షులు పేర్కొన్నారు’ అని ధర్మాసనం తెలిపింది. అయితే, సంఘటనా స్థలంలో దొరికిన ఆయుధం కారణంగా మృతుడు చనిపోలేదని పోస్టుమార్టం నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తించిన కోర్టు.. నిందితుడు ఏ కారణం లేకుండా తన స్నేహితుడిని ఎందుకు చంపుతాడో ప్రాసిక్యూషన్ నిరూపించడంలో విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. అయితే, మరణించిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని, పదునైన వస్తువుపై జారిపడడం చనిపోయి ఉండవచ్చని డిఫెన్స్ వాదించింది. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం పిటిషనర్ను నిర్ధోషిగా తీర్పు వెలువరించింది.