న్యూఢిల్లీ, మే 19: దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తూ వెళ్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పులను కూడా ‘బుల్డోజ్’ చేస్తున్నది. ఢిల్లీలో పాలనాధికారం ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును కాలరాసి దౌర్జన్యానికి దిగింది. నగర పాలనపై సర్వాధికారాలను తన కీలుబొమ్మ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) చేతుల్లో పెడుతూ శుక్రవారం రాత్రి ఆర్డినెన్స్ను జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్ (ఏ) అధికారుల పోస్టింగ్, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అనే ఓ కమిటీని ఏర్పాటుచేసింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఒక మంత్రిత్వశాఖ కార్యదర్శి స్థాయికి దిగజారనున్నది. ఈ ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వ నియంత పోకడను ప్రతిబింబిస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్తో ఢిల్లీలో గ్రూప్ (ఏ)తోపాటు డీఏఎన్ఐసీఎస్ అధికారుల పోస్టింగ్లు, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా రద్దయ్యాయి. ఇదే సమయంలో నగరంలో పై అధికారుల పోస్టింగ్, బదిలీలతోపాటు విజిలెన్స్ అధికారాలు ఎల్జీకి దఖలుపడ్డాయి. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ పేరుతో ఓ కమిటీని ఏర్పాటుచేస్తారు. దీనికి చైర్మన్గా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యుడిగా, నగర హోంశాఖ కార్యదర్శి మెంబర్ సెక్రెటరీగా ఉంటారు. నగరంలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నీ ఈ ముగ్గురు సమావేశమై, ఓటింగ్ నిర్వహించి ఎల్జీకి నివేదించాలి. అయినా, ఈ అథారిటీ సిఫారసులను ఎల్జీ గౌరవించాల్సిన పనిలేదు. వాటిని ధిక్కరించి తనకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు. నగరంలోని పోలీస్ వ్యవస్థ మొత్తం ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉన్నది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం ఎల్జీదే. సివిల్ అధికారులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్తో ఢిల్లీ ప్రభుత్వానికి ఆ అధికారాలు కూడా లేకుండా పోయాయి.
ఢిల్లీలో ఎవరి అధికారాలు ఏమిటన్నదానిపై 2015 నుంచి వివాదం నడుస్తున్నది. కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఢిల్లీ పాలనాధికారాలను మొత్తం ఎల్జీ చేతిలో పెట్టింది. అప్పుడే కొత్తగా ఏర్పడిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని డమ్మీని చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకొన్నదన్న విమర్శలు వినిపించాయి. కేంద్రం నిర్ణయంపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లటంతో.. కోర్టు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో కేజ్రీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ వివాదాన్ని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎల్జీ, ఎన్నికైన ప్రభుత్వం మధ్య స్పష్టమైన అధికారాల విభజనను సూచిస్తూ ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. నగరంలో శాంతిభద్రతల (పోలీస్ వ్యవస్థ) బాధ్యత మాత్రమే ఎల్జీదని, ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు ఎన్నికైన ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టంచేసింది. ఈ తీర్పు వెలువడి వారం తిరక్కముందే కేంద్రం దానిని అడ్డంగా ధిక్కరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కిరెన్ రిజిజును తప్పించిన మరుసటి రోజే ఈ ఆర్డినెన్స్ వెలువడటం గమనార్హం. తాజా ఆర్డినెన్స్తో ఎల్జీకి గతంలోకంటే అధిక అధికారాలు సంక్రమించాయి. శాంతిభద్రతలతోపాటు కార్యనిర్వాహక అధికారాలు కూడా ఎల్జీ చేతుల్లోకే వెళ్లిపోయాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా నగరంలో అధికారాల సమతుల్యం కోసమే ఈ ఆర్డినెన్స్ తెచ్చామని కేంద్రం ప్రకటించటం కొసమెరుపు.
ఆర్డినెన్స్పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. మోదీ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ మాత్రం ఆచితూచి స్పందించారు. ‘ఆర్డినెన్స్ను పూర్తిగా పరిశీలించిన తర్వాత స్పందిస్తాం’ అని కాంగ్రెస్ నేత, సుప్రీంకోర్టులో ఆప్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ చేసిన ట్వీట్ను కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. అంతకుముందు కోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ ఐదుగురు మంత్రులు ఎల్జీ ఇంటి ముందు బైఠాయించారు. గంటన్నర తరువాత వారిని కలిసేందుకు ఎల్జీ వీకే సక్సేనా అంగీకరించారు. ఆ తరువాత ఎల్జీని కలుసుకున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు.