న్యూఢిల్లీ, ఆగస్టు 27: సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ అనంతర సౌకర్యాలపై కేంద్రం వారం రోజుల్లో రెండో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తి పదవులు నిర్వహించి రిటైర్మెంట్ తీసుకున్నవారికి మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తూ నిబంధనలు సవరించారు. గత 23వ తేదీ ప్రకటించిన సవరణలకు కొన్ని అదనపు మార్పుచేర్పులు జరిపారు. శుక్రవారం జారీచేసిన తాజా నిబంధనల ప్రకారం చీఫ్ జస్టిస్గా లేదా జస్టిస్గా రిటైరైన వారికి ఇంటిలో పనిమనిషి, డ్రైవర్, ఆఫీసు సహాయకుడిని ప్రభుత్వ ఖర్చులతో సమకూరుస్తారు.
ఐదేండ్లపాటు వ్యక్తిగత భద్రతకు గార్డును సమకూర్చడంతో పాటుగా జీవితకాలం ఇంటివద్ద 24 గంటల పోలీసు భద్రతను కల్పిస్తారు. అదేవిధంగా రిటైర్డు సుప్రీంకోర్టు జడ్జీకి మూడేండ్లపాటు వ్యక్తిగత భద్రతను, నివాసం వద్ద 24 గంటల భద్రతను కల్పిస్తారు. ఒకవేళ ఎవరైనా చీఫ్ జస్టిస్ లేదా జస్టిస్కు ఇదివరకే అధిక ముప్పు కారణంగా అదనపు భద్రత కల్పిస్తే దానిని కొనసాగిస్తారు. ఉచిత ఫోన్ లేదా డాటా సౌకర్యం నిమిత్తం నెలకు రూ.4,200 చెల్లిస్తారు. రిటైరైన చీఫ్ జస్టిస్కు టైప్-7 నివాసాన్ని ఆరుమాసాల పాటు సమకూర్చాలని 23న జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు.