న్యూఢిల్లీ: పదేండ్ల తర్వాత ఓ హత్యాచార కేసులో నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్కు చెందిన యువతి (19) గురుగ్రామ్లోని సైబర్సిటీ ప్రాంతంలో పనిచేసేది. 2012 ఫిబ్రవరిలో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నిందితులు ఆమెను కారులో కిడ్నాప్ చేశారు. అనంతరం గ్యాంగ్రేప్నకు పాల్పడి.. ఆమె జననాంగంపై దాడి చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. మృతదేహాన్ని హర్యానాలోని రేవారిలో ఓ పొలంలో పడేశారు. మూడు రోజులకు ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో దొరికింది. 2014లో ముగ్గురు నిందితులు రవి కుమార్, రాహుల్, వినోద్ ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే న్యాయస్థానం ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించటంతో విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుల మరణ శిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు చెప్పే సమయంలో బాధితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా.. కోర్టులో ఉద్వేగాలకు తావు ఉండదని, వాస్తవాలు, సాక్ష్యాలు, ఆధారాలే ముఖ్యమని సీజేఐ తెలిపారు.