Supreme Court | దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దుర్వినియోగంపై కాంగ్రెస్ నేతృత్వంలో 14 ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో పత్రిపక్షాలు పిటిషన్ను ఉపసంహరించుకున్నాయి. సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు పిటిషన్లో ఆరోపించాయి. నాయకుల అరెస్ట్, రిమాండ్, బెయిల్పై నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు కోరాయి.
2013-14 నుంచి 2021-22 వరకు సీబీఐ, ఈడీ కేసులు 600శాతం పెరిగాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 121 మంది రాజకీయ నేతలను ఈడీ విచారించగా, వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారేనని, అదే సమయంలో 124 సీబీఐ విచారణల్లో 95శాతానికిపైగా ప్రతిపక్ష పార్టీలకు చెందినవారేనంటూ ప్రతిపక్షాల తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ విచారణ ఉండకూడదని చెప్పగలమా..? నాయకులను దూరంగా ఉంచగలరా? రాజకీయ నాయకుడు ప్రాథమికంగా పౌరుడని, పౌరులుగా మనమంతా ఒకే చట్టానికి లోబడి ఉంటామని కోర్టు పేర్కొంది.
దీనికి సింఘ్వీ స్పందిస్తూ భారతదేశంలో పెండింగ్లో ఉన్న ఏ కేసును సైతం ఈ పిటిషన్ ప్రభావితం చేయకూడదని, ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోమని కూడా కోరడం లేదన్నారు. ఈ మేరకు కోర్టు సామాన్యులకు, రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించలేమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రడూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అయితే, పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు సింఘ్వీ కోర్టును కోరగా.. అనుమతి ఇచ్చింది.