న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయని కేంద్ర ప్రభుత్వ అలసత్వ ధోరణిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని ఖాళీల భర్తీలో వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. తమకు కావలసినవారిని ప్రభుత్వం ఎంపిక చేసుకున్నట్టు ఆ నియామకాలు జరిగిన విధానం స్పష్టంగా చెబుతున్నదని వ్యాఖ్యానించింది. ‘ఇదేం ఎంపిక, ఇదేం నియామకం’ అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు జడ్జిల ఆధ్వర్యంలోని సెర్చ్ అండ్ సెలెక్షన్ కమిటీ దేశమంతా తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించి సిఫారసు చేసిన పేర్లను విస్మరించి, వెయిట్ లిస్ట్లోని పేర్లను ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునళ్లకు ప్రిసైడింగ్ అధికారులు, జ్యుడిషియల్, టెక్నికల్ సభ్యులను రెండు వారాల్లో నియమించాలని ఆదేశించింది.
సర్వీసు చట్టం ప్రకారం…
ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారని గత విచారణ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం… వారంలో నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం హడావుడిగా పలు ట్రిబ్యునళ్లలో కొందరు సభ్యులను నియమించి, అఫిడవిట్ను కోర్టుకు సమర్పించింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘కొందరి పేర్లను మాత్రమే సెలెక్ట్ లిస్ట్ నుంచి ఎంపిక చేశారు. మిగతా పేర్లను వెయిట్ లిస్ట్ నుంచి తీసుకున్నారు. సర్వీసు చట్టం ప్రకారం సెలెక్ట్ లిస్ట్ను విస్మరించి వెయిట్ లిస్ట్కు వెళ్లకూడదు. ఇదేం ఎంపిక, ఇదేం నియామకం?’ అని నిలదీసింది.
ఎప్పుడూ ఇదే తంతు
ఐటీఏటీకి సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ 41 మంది పేర్లను సిఫారసు చేస్తే, కేవలం 13 మందినే ప్రభుత్వం తీసుకున్నదని, దీనికి ప్రాతిపదిక ఏమిటో తెలియదని సీనియర్ న్యాయవాది అర్వింద్ తెలుపగా… ‘ఇదేం కొత్త కాదు. ప్రతిసారీ ఇదే తంతు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ పేర్కొనడంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ‘మనది ప్రజాస్వామ్య దేశం. మనం రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్నాం. మేం ఒప్పుకోం అని మీరు చెప్పలేరు’ అని స్పష్టం చేశారు.
ఏంటీ హడావుడి నియామకం?
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్పర్సన్గా జస్టిస్ ఎం వేణుగోపాల్ను కేంద్రం హడావుడిగా నియమించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్సీఎల్ఏటీ చైర్మన్ జస్టిస్ చీమా పదవీ విరమణకు 10 రోజుల ముందే జస్టిస్ వేణుగోపాల్ను నియమించారని, ఇలా ఎలా జరుగుతున్నదని ప్రశ్నించింది. దీనిపై గురువారం జరిపే విచారణకు హాజరుకావాలని ఏజీని ఆదేశించింది.