Supreme Court : కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ‘సర్’ నిలిపివేయాలని, దీనిద్వారా తమ రాష్ట్రంలోని ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం విమర్శించింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీరుపై సీఎం మమత మండిపడ్డారు. దీంతో సీఈసీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. అదిప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. ‘సర్’ను పర్యవేక్షించేందుకు జిల్లా జడ్జి లేదా జిల్లా మాజీ జడ్జి స్తాయి అధికారులను నియమించాలని కోల్కతా హైకోర్టుకు సూచించింది. ఇకపై సీఈసీ, ప్రభుత్వం మధ్య వచ్చే వివాదాలు, సమస్యల్ని ఈ అధికారులే పర్యవేక్షిస్తారని కోర్టు వెల్లడించింది. ఈ విషయంలో తమకు ఇంకో ఆప్షన్ లేదని కోర్టు అభిప్రాయపడింది. కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్.. ఈ అధికారుల నియామకం చేపట్టాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వివాదంపై మమతా బెనర్జీ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
గ్రూప్ బీ ఆఫీసర్లను తమ కోసం పనిచేసే ఎలక్టోరల్ రిజిష్టర్ ఆఫీసర్స్ (ఈఆర్వో)లుగా కేటాయిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఈసీ వ్యతిరేకించింది. దీనిపైనే ప్రధానంగా వివాదం మొదలైంది. అయితే, ఇకపై కోర్టు నియమించబోయే జ్యుడీషియల్ అధికారులే ఈఆర్వోలుగా పని చేస్తారని సుప్రీం తెలిపింది. ఓటర్లు, ప్రజలు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాల్ని ఈ జ్యుడీషియల్ అధికారుల బృందమే పర్యవేక్షిస్తుంది. ప్రతి జిల్లాలోనూ ఓటరు లిస్టులో పేరు ఉంచడం, తొలగించడం, డాక్యుమెంట్ల పరిశీలన వంటివి వీరు చూస్తారు. ఈ అధికారులకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు రవాణా వంటి అన్ని అంశాల్లో సాయం అందించాలని ఆదేశించింది.