Agneepath Scheme | భారత సాయుధ దళాల రిక్రూట్మెంట్ కోసం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటుపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అగ్నిపథ్ చట్టబద్ధతను సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అదే సమయంలో పథకం అమలుకు ముందు, భారత వైమానిక దళంలో రిక్రూట్మెంట్కు సంబంధించిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు 17న విచారించనుంది. అగ్నిపథ్ పథకం నేపథ్యంలో ఇండియన్ ఎయిర్పోర్స్లో రిక్రూట్మెంట్ పాత స్కీమ్ను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో రిక్రూట్మెంట్లో భాగంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల నియామకం ప్రమాదంలో పడింది. ఈ అంశంపై కోర్టు విచారించనున్నది.
ఆర్మీ రిక్రూట్మెంట్లో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన పథకం ఏకపక్షం తీసుకున్న నిర్ణయం కాదని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేసిన పథకమేనంటూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన పథకంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ జరపడం సరికాదని గోపాల్ కృష్ణన్తో పాటు ఓ ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి, అగ్నిపథ్ స్కీమ్ సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచుతుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దాంతో పిటిషనర్లు ఢిల్లీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.