Supreme Court | పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానంలో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ కోరారు. ఈ నెల 13న సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు జీరో అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభ చాంబర్లోకి దూకిన విషయం తెలిసిందే. పసుపు రంగు స్మోక్ను సభలో వదలగా.. అదే సమయంలో అమోల్ షిండే, నీలందేవి పార్లమెంట్ కాంప్లెక్స్ వెలుపల నియంతృత్వం పని చేయదని నినదిస్తూ స్మోక్ను వదిలిన విషయం తెలిసిందే.
అదే ఘటనలో లలిత్ ఝా అనే యువకుడు నిరసనల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, ఈ వ్యవహారంపై అబు సోహైల్ అనే వ్యక్తి న్యాయవాది శుత్రి బిష్త్ ద్వారా పిటిషన్ లాఖలు చేశారు. లోక్సభ భద్రతలో వైఫల్యంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్రంగా, నిష్పాక్షికంగా న్యాయ విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేయగా.. విచారణ కొనసాగుతున్నది. అరెస్టయిన నిందితుల్లో సాగర్ శర్మ, మనోరంజన్ డీ, అమోల్ షిండే, నీలం దేవి, లలిత్ ఝా, మహేశ్ కుమావత్ ఉన్నారు.