Supreme Court | న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు పేర్కొన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వ అధికారుల్లో కుల సమీకరణాలను ఉద్దేశించి జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ ‘యాదవ్ రాజ్ వర్సెస్ ఠాకూర్ రాజ్’ శీర్షికన ఒక కథనం రాశారు.
దీనిపై లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 20న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను శుక్రవారం జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ విచారించారు.
పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కేవలం జర్నలిస్టు రాసినవి ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నాయనే కారణంతో క్రిమినల్ కేసులు పెట్టొద్దు’ అని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై స్పందన తెలియజేయాల్సిందిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసును నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
ఈ లోగా పిటిషనర్దారుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా, యూపీ పోలీసులు అధికారిక ‘ఎక్స్’ అకౌంట్ ద్వారా చట్టపరమైన చర్యలు ఉంటాయని పిటిషనర్ను హెచ్చరించారని, అతడిపై రాష్ట్రంలో ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయో కూడా తెలియని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించినట్టు పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.