Manipur Violence | మణిపూర్ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిందని వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా నియంత్రణ కోల్పోయారని పేర్కొన్నది. ఈ నెల 7న రాష్ట్ర డీజీపీ స్వయంగా హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు మరోసారి కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర పోలీసుల వైఫల్యాన్ని ఎండగట్టింది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని పేర్కొన్నది. ఎఫ్ఐఆర్ల నమోదు, కేసుల దర్యాప్తు విషయంలో పోలీసులు తీవ్ర అలసత్వం వహించారని మండిపడింది. ఈ నెల 7న రాష్ట్ర డీజీపీ స్వయంగా హాజరై దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మణిపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు మంగళవారం వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. మహిళల నగ్న ఊరేగింపు ఘటనకు సంబంధించిన రెండు కేసులనే కాకుండా మహిళలపై జరిగిన అన్ని నేరాలకు సంబంధించిన కేసులను సీబీఐకి అప్పగించాలని కేంద్రం కోరింది. అయితే అన్ని కేసులను సీబీఐ దర్యాప్తు చేయలేదని, కేసుల విచారణకు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని కోర్టు తెలిపింది.
మణిపూర్లో అల్లర్లను అదుపు చేయటంలో, నిందితులను అరెస్టు చేయటంలో, కేసుల దర్యాప్తులో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల నగ్న ఊరేగింపు ఘటన జరిగిన తేదీ, ఈ కేసులో జీరో, రెగ్యులర్ ఎఫ్ఐఆర్ల నమోదుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో అల్లర్లు, ఇతర ఘటనలకు సంబంధించి నమోదైన 6 వేలకు పైగా ఎఫ్ఐఆర్లలో ఎంత మందిని నిందితులుగా చేర్చారు? వారి అరెస్టుకు తీసుకొన్న చర్యలు ఏంటి? అనే వివరాలు కూడా తెలుసుకోవాలని అనుకొంటున్నామని ధర్మాసనం పేర్కొన్నది. నగ్న ఊరేగింపు ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందనేది సుస్పష్టమని వ్యాఖ్యానించింది. ‘పోలీసులు చేస్తున్న దర్యాప్తు నత్తనడకన ఉన్నది. ఘటనలు జరిగిన ఎప్పుటికో కానీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదు. కేసుల్లో నిందితుల అరెస్టులు కూడా జరుగలేదు. వారి వాంగ్మూలాలు రికార్డు చేయలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలాయి. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైంది’ అని ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది.
మణిపూర్లో అల్లర్లు ప్రారంభమైన నాటి నుంచి 6,523 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు మణిపూర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు ఘటనలో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసులో ఓ మైనర్తో పాటు ఏడుగురిని అరెస్టు చేశారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత, పోలీసులు బాధిత మహిళల వాంగ్మూలాలు తీసుకొన్నారని చెప్పారు. మహిళల వివస్త్ర ఘటనకు సంబంధించి 11 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ‘కేవలం ఒకటి రెండు కేసుల్లో మినహా మిగతా కేసుల్లో అరెస్టుల సంగతేంటి? 6 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదైతే.. ఏడుగురిని మాత్రమే అరెస్టు చేశారా?’ అని సీజేఐ ధర్మాసనం ప్రశ్నించగా.. సొలిసిటర్ జనరల్ నుంచి సమాధానం రాలేదు.
మే 4న అల్లరిమూకల అరాచకాలకు బలైన ఇద్దరు మహిళా బాధితులను పగటిపూట విచారించవద్దని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. పగటి పూటి విచారణకు హాజరు కావాలని బాధితులను సీబీఐ అధికారులు కోరుతున్నారని ఇద్దరు బాధిత మహిళల తరపున హాజరైన న్యాయవాది నిజాం పాషా అంతకుముందు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.