Supreme Court | మద్యం పాలసీ కేసులో అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు ఈడీకి సమాధానం కోరింది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అఫిడవిట్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో ఈడీ కేంద్ర ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందనడానికి తన అరెస్టే నిదర్శనమన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు సమాన పోరాట స్థాయి కల్పించాలన్న ఆయన.. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే తనను అరెస్టు చేసిన తీరు ఈడీ ఏకపక్ష వైఖరిని తెలియజేస్తుందన్నారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో పైచేయి సాధించినట్లుగా ఆరోపించారు. మద్యం పాలసీ కేసుపై ముఖ్యమంత్రి స్పందిస్తూ దక్షిణాదికి చెందిన ఏ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నిధులు తీసుకున్నట్లుగా ఆధారాలు లేవన్నారు.
గోవా ఎన్నికల ప్రచారంలో ఈ డబ్బును ఉపయోగించామనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క రూపాయి కూడా రాలేదని, ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు. ఈ కేసులో ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి మనీష్ సిసోడియా సైతం ఏడాదిన్నరగా తీహార్ జైలులో ఉన్నారు.