న్యూఢిల్లీ, జూలై 5: ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ స్వతంత్రత అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ ఉద్ఘాటించారు. అధికారాల విభజన ద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రత, ప్రజాస్వామ్యం అనేవి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు.
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన సింఘ్వీ ట్రినిటీ కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మెజారిటీ వర్గాల పాలన ప్రజాస్వామ్యం కాదని, వ్యక్తిగత హక్కులు, పౌరుల స్వేచ్ఛకు రక్షణ కల్పించడమే ప్రజాస్వామ్యమని తెలిపారు. వీటిని న్యాయవ్యవస్థ మాత్రమే రక్షిస్తుందన్నారు.