MLA Poaching Case | న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎరకేసు దర్యాప్తులో సీఎం జోక్యం చేసుకున్నారనటానికి ఆధారాలే లేవని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనానికి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశం నిర్వహించటం దర్యాప్తులో జోక్యం చేసుకోవటం కిందకు రానేరాదని వాదించారు. ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను సుప్రీం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవిందకుమార్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
సీఎం ఆధారాలను ఇతరులకు ఎలా పంపుతారు? అన్న సుప్రీం కోర్టు ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభుత్వాలను కూల్చేందుకు తెర వెనుక జరిగిన కుట్రను చెప్పటమే సీఎం ఉద్దేశమని దవే చెప్పారు. ఈ ఒక్క విషయాన్ని ఆధారంగా చేసుకుని నిందితులు కోరుకునే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయటాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న పలు కేసుల గురించి నిత్యం టీవీల్లో ప్రసారమవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా దవే లేవనెత్తారు. తాజాగా ఆదివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మద్యం కేసులో సీబీఐ విచారణ చేస్తున్న విషయాలు కూడా టీవీలు, పత్రికల్లో వార్తలుగా వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన కుట్రకు సంబంధించి ఐదుగంటల నిడివి ఉన్న వీడియో, ఆడియో, వాట్సాప్ చాట్ వంటి కీలక ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయని వెల్లడించారు. నిందితులు కోరుకున్నట్టుగా దర్యాప్తు ఎంపిక జరగరాదని కోరారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేపట్టడమంటే నిందితులు కోరుకున్నట్టు చేయటమేనని వివరించారు. సీబీఐ దర్యాప్తు జరిపితే సిట్ ఆధారాలన్నీ ధ్వంసం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులు బీజేపీకి చెందిన వారని, బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండే సీబీఐకి ఈ కేసు దర్యాప్తును ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దవే కోరారు. హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తునకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
విపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్న సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అధికార బీజేపీ నేతలపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదని న్యాయవాది దవే నిలదీశారు. బీజేపీకి ఇష్టం లేని ప్రాంతీయ పార్టీల పాలనలోని ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ చూస్తున్నదని, ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలను బీజేపీలో చేరాలని కోట్ల రూపాయల ఎర వేసిందని చెప్పారు. జస్టిస్ బీఆర్ గవాయి జోక్యం చేసుకుంటూ కేసుకు సంబంధించిన ఆధారాల్ని సీఎంకు ఇచ్చారా అని ప్రశ్నించారు. గత ఏడాది అక్టోబర్ 27న తెలంగాణ హైకోర్టుకు సమర్పించామని, నవంబర్ 3న పూర్తి సమాచారంతో కూడిన పెన్డ్రైవ్ను అందచేశామని చెప్పారు. కోర్టకు అన్ని ఆధారాలు సమర్పించాకే సీఎం మీడియా సమావేశంలో చెప్పారని, వాస్తవానికి అన్ని విషయాలు అప్పటికే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయని, సీఎం కేసీఆర్ కొత్తగా ప్రెస్మీట్లో చెప్పిందేమీ లేదని దవే స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వాస్తవ కోణంలో చూడాలని కోరారు. ఈ వ్యవహారం బీజేపీ లేదా బీఆర్ఎస్కు సంబంధించినది కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని చెప్పారు.
ఓట్లు వేసి గెలిపించిన ఓటర్ల తీర్పును కాలరాసేలా ఎమ్మెల్యేల కొనుగోలుకు చేసిన కుట్ర వెనుక పెద్దల నిగ్గు తేల్చాలని, అందుకే నిందితులు కోరిన సీబీఐ దర్యాప్తు కాకుండా అనేక కీలక ఆధారాలు సేకరించిన సిట్ తోనే దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సీబీఐ దర్యాప్తు చేసే కేసులేవీ గోప్యంగా లేవని చెప్పటంతో సుప్రీం కోర్టు కల్పించుకుని సీబీఐ పూర్తి విచారణ అంశాలను బహిర్గతం చేస్తున్నదని చెప్తున్నారా? అని ప్రశ్నించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లకు సంబంధించిన అనేక కేసులను సీబీఐ తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిందని దవే చెప్పారు. మొత్తం 5 గంటల వీడియో, ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్స్ ఆధారాలున్నాయని, నిందితులతో బీజేపీ పెద్దల ఫొటోలు, ఒకే లొకేషన్లో సిగ్నల్, ఫాంహౌస్ నుంచి నిందితులు ఆ పెద్దలతో చాట్ చేసిన ఆధారాలన్నీ సిట్ దగ్గర ఉన్నాయని, ఇలాంటి పరిస్థితిలో సీబీఐ దర్యాప్తు చేయరాదని దవే వివరించారు.
తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన జాతీయ పార్టీతో చేస్తున్న పోరాటాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని న్యాయవాది దుష్యంత్ దవే కోర్టును కోరారు. దేశంలో విపక్షాల పార్టీల నేతలపై 35 కీలకమైన కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇవి ఏవి కూడా అంగుళం కూడా కదలిక లేకుండా ఉన్నాయని తెలిపారు. అనేక మంది ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని తెలిపారు. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారని, కీలక ఆధారాలు సేకరించారని, దీంతో జాతీయ స్థాయిలోని అధికార పార్టీ నేతలకు భయం పట్టుకున్నదని చెప్పారు.
ఈ కేసులో ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రజాస్వామ్య పునాదిపై దాడి చేస్తున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ కేసులో బీజేపీ క్లీన్చిట్ కోరుకుంటున్నదని, వాళ్లు కోరుకున్న సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వటం సరికాదన్నారు. ఇప్పటికే ఎనిమిది రాష్ర్టాల్లోని ఇతర పార్టీ ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని చెప్పారు. వాస్తవానికి ఈ కేసులో బీజేపీ స్టే మాత్రమే కోరిందని, తర్వాత నిందితులు కోర్టుకు వచ్చారని, ఈ కోణంలో కూడా పరిశీలన చేయాలని కోరారు. దుష్యంత్ దవే సుమారు గంటపాటు తన వాదనలు కొనసాగించారు. హోలీ సెలవుల తర్వాత తదుపరి విచారణ మార్చి 13న చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. బీజేపీ తరుపున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ విచారణకు హాజరయ్యారు.