న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ప్రభుత్వ ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పదవీ విరమణకు ఒక్క రోజు వ్యవధి ఉన్నా ఇంక్రిమెంట్కు అర్హులేనని, వారు ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చని స్పష్టం చేసింది. ఇంక్రిమెంట్ ప్రకటించిన మరుసటి రోజు ఉద్యోగి రిటైర్ అయినా, ఆ ప్రయోజనాన్ని నిరాకరించడానికి వీల్లేదని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థించింది.
కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) తరఫు న్యాయవాది వాదనలు తోసిపుచ్చింది. ‘విధులు నిర్వర్తించటంలో మంచి ప్రవర్తన, ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకొని ఉద్యోగికి సంస్థ ఇచ్చే ప్రోత్సాహకం.. వార్షిక ఇంక్రిమెంట్. సర్వీస్లో ఉండగా ఇంక్రిమెంట్ ప్రకటన వెలువడితే నిరాకరించడానికి వీల్లేదు’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇంక్రిమెంట్ వర్తిస్తుందా? లేదా? అన్నదానిపై కొన్ని రాష్ర్టాల హైకోర్టులు ఇప్పటివరకూ భిన్నమైన తీర్పులు వెలవరించాయి. సుప్రీంకోర్టు తాజాగా దీనిపై స్పష్టత ఇవ్వటంతో అవన్నీ రద్దు అయినట్టే.