Cough Syrup | మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గు మందు కారణంగా చిన్నారులు మృతి చెందారని.. ఈ అంశంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన ప్రజప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. మొదట ధర్మాసనం నోటీసులు జారీ చేసేందుకు అంగీకరించినప్పటికీ.. కేసును పరిశీలించిన తర్వాత పిటిషన్ను తోసిపుచ్చింది. న్యూస్పేపర్లు చదివిన తర్వాత పిటిషనర్లు కోర్టును ఆశ్రయిస్తున్నారంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పిటిషన్ను వ్యతిరేకించారు. తాను ఏ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించడం లేదని.. కానీ తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఈ విషయంలో తీవ్రమైన చర్యలు తీసుకున్నాయని, వాటిని విస్మరించలేమని మెహతా కోర్టుకు తెలిపారు. డ్రగ్స్ చట్టాలను అమలు చేసేందుకు తగిన వ్యవస్థలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఎన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని పిటిషనర్ తివారీని ధర్మాసనం ప్రశ్నించింది. తాను ఎనిమిది నుంచి పది పిల్స్ పిటిషన్లను దాఖలు చేశానని తివారీ సమాధానం ఇవ్వగా.. ధర్మాసనం ఆయన పిటిషన్ను తోసిపుచ్చింది.
నాసిరకం మందులు మార్కెట్కు చేరకుండా తొలుత నాణ్యత పరీక్షా వ్యవస్థల్లోని లోపాలను దర్యాప్తు చేయాలని.. ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిల్లో న్యాయవాది తివారీ కోరారు. అమ్మకాలు, ఎగుమతులకు అనుమతించే ముందు ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్లలో అనుమానిత ఉత్పత్తులకు టాక్సికాలజీ పరీక్షను తప్పనిసరి చేయాలని పిటిషనర్ కోరారు. కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ కారణంగా మధ్యప్రదేశ్లో 23 మంది చిన్నారులు మృతి చెందారు. మృతి చెందిన పిల్లల్లో ఒకే రకమైన లక్షణాలు కనిపించాయి. అయితే, ఒక బిడ్డ కుటుంబం పోస్ట్మార్టంకు అంగీకరించింది. ఆ తర్వాత ఆ బిడ్డ మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. రాజస్థాన్లో ముగ్గురు పిల్లలు సైతం ఇలాంటి కారణాలతోనే మరణించారని భావిస్తున్నారు. పిల్లలకు జలుబు, దగ్గు సమస్యలు రాగా వారికి దగ్గు మందును సిఫారసు చేశారు. రెండు మూడు రోజుల తర్వాత పిల్లల్లో మూత్ర విసర్జన బంద్ ఆగిపోయింది. దర్యాప్తులో మూత్రపిండాలు పనిచేయడం లేదని.. ఆ తర్వాత కొద్దిరోజులకే పిల్లలు చనిపోతున్నట్లుగా గుర్తించారు. దగ్గు మందు సిరప్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పలు రాష్ట్రాలో ఈ సిరప్ను బ్యాన్ చేశాయి.