Maharashtra Political Crisis | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం కీలక తీర్పును వెలువరించే అవకాశం ఉన్నది. రెండు కేసులకు సంబంధించి గురువారం తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే, ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం వర్సెర్ ఎల్జీ కేసులో తీర్పు వెలువరించే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. గతేడాది జూన్లో మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. శివసేన రెబల్ నేత, అప్పటి పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు 40 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఆ తర్వాత అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి అప్పటి సీఎం ఉద్ధవ్ను బలాన్ని నిరూపించుకోవాలని కోరారు. గవర్నర్ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉద్ధవ్ ఠాక్రేతో పాటు శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చి 16న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పలు పిటిషన్లపై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. ఆయా పిటిషన్లపై ఉద్ధవ్, షిండే తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించగా.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఉద్ధవ్ ఠాక్రే తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, దేవదత్ కామత్, న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ వాదనలు వినిపించారు. గవర్నర్ వ్యవహరించిన తీరుపై వాదనలు వినిపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, హరీశ్ సాల్వే, మహేశ్ జెఠ్మలానీ, న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో గవర్నర్ కార్యాలయం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. రాజకీయ సంక్షోభంపై తొమ్మిది రోజుల పాటు విచారణ జరిపిన అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది.
అప్పటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని 2022 జూన్లో అప్పటి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఆదేశాలను రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని థాకరే వర్గం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి థాకరే వర్గం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. శివసేన ఎమ్మెల్యేల మధ్య విభేదాల నేపథ్యంలో ఫ్లోర్ టెస్ట్కు ఆదేశించడంపై గవర్నర్ కోష్యారీపై సుప్రీంకోర్టు అంతకు ముందే ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గురువారం సుప్రీంకోర్టు ఈ విషయంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తీర్పును న్యాయమూర్తి చదివి వినిపించిన తర్వాత.. జడ్జీలంతా సంతకాలు చేయనున్నారు.
సుప్రీంకోర్టు తీర్పుకు ముందే చాలా పార్టీలు భవిష్యత్ రాజకీయ సమీకరణలపై స్పందించాయి. కోర్టు తీర్పుతో ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడవ్నీస్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆశాజనకంగా ఉన్నామని, అన్నింటినీ చట్టబద్ధంగానే చేశామన్నారు. కోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందని దేవేంద్ర ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పుతో దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా? లేదా తేలుతుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందా? లేదా? మన న్యాయ వ్యవస్థ ఎలాంటి ఒత్తిడికి లోనై పని చేస్తుందో రేపు తేలనున్నదన్నారు. రాజ్యాంగం ప్రకారం నడవని పాక్ పరిస్థితిని చూడాలన్నారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడపడాలని తాము కోరుకుంటున్నామని, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నారు.