న్యూఢిల్లీ: ప్రజలు, ముఖ్యంగా ఎదిగే పిల్లల ఆరోగ్యం పట్ల సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు కలిగిన ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించాలని ఆహార భద్రతకు సంబంధించిన వారందరినీ న్యాయస్థానం కోరింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ తీవ్రమైన విషయంపై సవివరమైన ఉత్తర్వులు జారీచేస్తామని, సంబంధిత వర్గాల నుంచి సమాచారం కోరుతామని తెలిపింది.
మాకు ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యం గురించే ఆందోళన. సంబంధిత వర్గాలన్నీ ఈ విషయాన్ని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాము అని ధర్మాసనం పేర్కొంది. తాము కూడా ఈ విషయంపై కొంత కసరత్తు చేశామని, ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు లేదా కొవ్వు పరిమితిని దాటినపుడు ఆ విషయాన్ని ప్యాకెట్ ముందు భాగంలో చూపించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైనా మార్గదర్శకాన్ని రూపొందించిందా అని ధర్మాసనం ప్రశ్నించింది.